మర్రిగూడ : తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో ఒకేరోజు చోరీలు జరిగాయి. మర్రిగూడ ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాలు.. మర్రిగూడ మండలం శివన్నగూడెం, ఖుదాబక్ష్పల్లి గ్రామాల్లో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు ఒకే రోజు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామన్నారు. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తే పోలీసులకు, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అమరవరంలో మరో ఇంట్లో..
హుజూర్నగర్ : తాళం వేసిఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి రూ.15 వేల నగదును అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన సోమవారం హుజూర్నగర్ మండలం అమరవరంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన చేపూరి రామారావు తన ఇంట్లో కిరాణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. అతను తన కంటి ఆపరేషన్ నిమిత్తం ఈనెల 22న హైదరాబాద్కు వెళ్లి అక్కడ వైద్యం చేయించుకున్నాడు. ఆసుపత్రి నుంచి ఆగస్టు 30న ఇంటికి వచ్చి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వెనకాల ఉన్న తలుపుని తెరిచి గడ్డపారతో ఇనుప బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.15 వేల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.
తగ్గని వాహనాల రద్దీ
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం కూడా హైదరాబాద్ మార్గంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులుదీరాయి. పట్టణంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో వాహనాలను సర్వీస్ రోడ్ల మీదుగా మళ్లించారు. అయినా అర్ధరాత్రి వరకూ రద్దీ ఏ మాత్రమూ తగ్గలేదు. ఫలితంగా వాహనదారులు, స్థానిక ప్రజానీకం నానా అవస్థలకు గురయ్యారు.


