నల్లగొండ టౌన్ : పాలకులు విద్యార్థుల హక్కులు కాలరాస్తే ఉద్యమాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ హెచ్చరించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు విద్యార్థులను ‘పరాన్నజీవులు’ అనడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. శ్రమజీవుల పిల్లలు పరాన్నజీవులుగా మారాలని కోరుకోరని పేర్కొన్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలు కష్టపడి, ఆటపాటలను త్యాగం చేసి చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆడుకుంటోందని, ప్రభుత్వం సైతం విద్యార్థుల భవిష్యత్ను కార్పొరేట్ వ్యాపారులకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు. పోటీ పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీకేజీల వల్ల మనోవేదనకు గురై 22 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, డి.కిరణ్, ఎం.మమత, ఆకారపు నరేష్, కె.శంకర్, మల్లం మహేష్, కుర్ర సైదానాయక్, ముస్కు రవీందర్, మారుపాక కిరణ్, ఆదిల్, నవదీప్, జగదీష్, జగన్, వీరన్న, ప్రసన్న, యశ్వంత్ పాల్గొన్నారు.
ఫ ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ
కార్యదర్శి ఐషీ ఘోష్


