భువనగిరి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. గురువారం భువనగిరిలోని కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల భద్రత ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతకు ముందు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, వసతి, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.
పోలీస్స్టేషన్ తనిఖీ
భూదాన్పోచంపల్లి: శాంతిభద్రతల విషయంలో పోలీస్సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం పోచంపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా పోలీస్సిబ్బంది హాజరు, వారి పనితీరు, స్టేషన్ డైరీ, కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు, పెండింగ్లో ఉన్న కేసులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, ఎస్ఐ జగన్, మహిళా ఎస్ఐ లైలా, పోలీస్సిబ్బంది తదితరులున్నారు.
రేపు జాబ్మేళా
భువనగిరి: నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పద్మ తెలిపారు. కనీసం 10వ తరగతి లేదా ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఆధార్కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో ఉదిత ఒకేషనల్ జూనియర్ కళాశాలలో హాజరుకావాలని కోరారు.
దరఖాస్తులకు ఆహ్వానం
భువనగిరి: జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పానాధికారి పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీటీ లేదా ఎంపీటీ చదివి, 43 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్ట్రర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సాగు నీరందించాలి
ఆలేరురూరల్ : అశ్వరావుపల్లి ప్రాజెక్టు నుంచి దేవాదుల కాల్వ ద్వారా సాగునీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. గురువారం ఆలేరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు లేక, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గండంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వరావుపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తే పటేల్గూడెం, గండ్లగూడెం, కందిగడ్డతండా, తూర్పుగూడెం, గొలనుకొండ, శారాజీపేట ఇతర ప్రాంతాలకు, కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందుతాయన్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో చలో హైదరాబాద్లో ఇందిరాపార్క్ వద్ద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నినాదంతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఎం.ఎ ఇక్బాల్, మండల అధ్యక్షులు దూపటి వెంకటేష్, తుసలయ్య, పిక్క గణేష్, మిట్ట శంకరయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


