సాక్షి యాదాద్రి : నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ భూములను చేర్చడం, నిబంధనలకు విరుద్ధంగా వాటిని తొలగించడం, ఫీనిక్స్ వంటి కార్పొరేట్ సంస్థలతో జరిగిన భూ లావాదేవీలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాశం భాస్కర్ డిమాండ్ చేశారు. జిల్లా వారీగా పూర్తి ల్యాండ్ రికార్డులతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. గురువారం భువనగిరిలో వారు విలేకరులతో మాట్లాడారు. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, అక్రమ ఇసుక రవాణా, 22ఏ భూముల సమస్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మౌనం వహించడాన్ని వారు తప్పుబట్టారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు కాక సామాన్య ప్రజలు తహసీల్దార్, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించకపోతే ప్రజల తరఫున పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు
ఊట్కూరి అశోక్ గౌడ్


