చౌటుప్పల్ : ఉపాధి కరువై ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్లో బుధవారం రాత్రి జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు(32) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం చౌటుప్పల్కు వచ్చాడు. స్థానికంగా రాంనగర్కాలనీలో అద్దెకు ఉంటూ వెల్డింగ్ పనిచేసేవాడు. జానకిరావుకు గతంలోనే వివాహం కాగా.. 2023లో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంకా పిల్లలు కలుగలేదు. ఇటీవల భార్యాభర్తల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు నాలుగైదు రోజులుగా ఎటువంటి పనిలేక ఇంట్లోనే ఉంటున్నాడు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన అతడు బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు జోగారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ఆలేరురూరల్ : రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆలేరులో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాములు(50) మతిస్థిమితం సరిగా లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి గత కొన్ని సంవత్సరాలుగా ఆలేరు పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆలేరు పట్టణంలోని బీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. ఆలేరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఆలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.


