పెద్దవూర: జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దవూర మండలం, పోతునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఏనేమీదిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్లపల్లి రవీందర్రెడ్డి(52) గతంలో వ్యవసాయ పనులు చేసేవాడు. గత ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమై కోలుకున్నాడు. అప్పటి నుంచి అతడి మానసిక ఆరోగ్య స్థితి సరిగా ఉండేది కాదు. గత పదమూడేళ్లుగా ఆయన భార్య, కుమారుడు, కుమార్తె హైదరాబాద్లో నివసిస్తుండగా.. రవీందర్రెడ్డి మాత్రం తన స్వగ్రామమైన ఏనేమీదిగూడెంలోనే ఉంటున్నాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన గత మూడు రోజుల క్రితం తన ఇంటిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులను పగలగొట్టి చూడగా రవీందర్రెడ్డి మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉంటున్న అతడి భార్య వడ్లపల్లి కవితకు ఫోన్లో సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రావు తెలిపారు.


