మోత్కూరు : సాధారణంగా రాళ్లను కొడితే కర్కశమైన శబ్దాలు వస్తాయి. కానీ మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని రాళ్లు మాత్రం అందుకు భిన్నంగా సంగీత స్వరాన్ని వినిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. మోత్కూరులోని కొంత ఇద్దయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ‘ఏనె గుండ్లు’ (నల్ల రాళ్లు) స్థానికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గుండ్లలోని ఒక్కో రాయిని చిన్న రాయితో తట్టినప్పుడు లోహపు గంట నాదంలా వస్తోంది. ఈ శబ్దాలకు అనుగుణంగా కొందరు లయబద్ధంగా వాయిస్తుంటే, మరికొందరు తమ సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్గా మారి రోజురోజుకూ సందర్శకుల రద్దీ పెరుగుతోంది.
సైన్స్ ఏమంటోంది?
రాయి ఆకారం, పరిమాణం, సాంద్రత, అంతర్గత నిర్మాణంలోని భౌతిక లక్షణాల వల్ల కొన్ని శిలలు కంపించి ఇలాంటి ప్రత్యేకమైన ధ్వనులను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి వాటిని ‘సంగీత శిలలు’ అని, వీటితో స్వరాలు పలికించే వాయిద్యాన్ని ‘లిథోఫోన్’ అని పిలుస్తారని పేర్కొంటున్నారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి
ఈ రాళ్లపై అధ్యయనం చేయిస్తే వీటి అంతర్గత నిర్మాణంపై మరింత స్పష్టత వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. అధికారులు ఈ ప్రాంతాన్ని గుర్తించి, రాళ్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇది మంచి పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఫ భిన్నమైన శబ్దాలతో ఆకట్టుకుంటున్న ‘ఏనె గుండు’
ఫ పెరుగుతున్న సందర్శకుల తాకిడి


