నూతనకల్: ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అకస్మాత్తుగా మంటలు రావడంతో గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్లలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాగంటి ముత్తమ్మ(65) తన మనుమడు జంపన్నతో కలిసి నివాసం ఉంటుంది. ఆదివారం వంట చేసేందుకు గ్యాస్ స్టౌవ్ వెలిగిస్తున్న క్రమంలో గ్యాస్ లీకై ఆకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.
యువకుడు అదృశ్యం
భువనగిరి: యువకుడు అదృశ్యమైన సంఘటన భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అన్నంపట్ల నరేష్ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు గ్రామంతోపాటు బంధువుల ఇళ్లల్లో వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆయన భార్య జానకి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. గత ఐదు నెలల క్రితం కుటుంబ కలహాల కారణంగా నరేష్ భార్య తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతను మానసికంగా బాధపడుతున్నాడు. ఆచూకీ తెలిసిన వారు భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఇంట్లో వెండి, బంగారు
ఆభరణాలు చోరీ
గుండాల: గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో బంగారంతో పాటు, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన గుండాల మండలంలోని రామారం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అన్రెడ్డి యాదిరెడ్డి, ఆయన భార్య అండాలు ఇంటికి తాళం వేసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ప్రహరీ దూకి, ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా పగుల గొట్టి, అందులో ఉన్న పది తులాల వెండితో పాటుగా, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అండాలు పనులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా.. బీరువా తాళం పగులగొట్టి ఉంది. అందులో వెండి, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వారు అక్కడకు చేరుకుని క్లూస్టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు.


