అర్వపల్లి: అర్వపల్లిలోని రిషిత వైన్స్– 1లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాగారం సీఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ మధు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అర్వపల్లిలోని రిషిత వైన్స్– 1లో ఈనెల 22న రాత్రి గుర్తుతెలియని దొంగలు షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి దుకాణంలోని రూ.25వేల నగదు, కొంత మద్యం చోరీ చేశారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలించారు. మంగళవారం అర్వపల్లిలో హైవేపై ఎస్ఐ మధు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారిని విచారించగా వైన్స్లో చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులు సిద్ధిపేట పట్టణానికి చెందిన పిన్నోజు రవి, జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన అనపర్తి దుర్గయ్య, కర్కాని నరేష్లుగా గుర్తించారు. వీరి నుంచి రూ.17,200 నగదు, బైక్, ఖాళీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రవి, దుర్గయ్య ఇద్దరికీ సూర్యాపేట జైలులో పరిచయం ఏర్పడింది. రవిపై తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో 20 కేసులు ఉన్నాయి. దుర్గయ్యపై ఇప్పటికే రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి. ముగ్గురు నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది శ్రీను, లింగయ్య, బాలకృష్ణ, వెంకట్, కృష్ణ పాల్గొన్నారు.


