భువనగిరిటౌన్ : సీపీఎం సీనియర్ నాయకుడు ఏఐకేఎస్ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆదర్శ కమ్యూనిస్టు అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. భువనగిరిలో సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. భువనగిరి రైతాంగ సమస్యలు, బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం, మూసి కాలుష్యం, బునాదిగాని కాలువ సాధన ఉద్యమాల్లో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, లావుడియా రాజు, ఎండీ సలీం పాల్గొన్నారు.
కలెక్టర్కు వినతి
సంస్థాన్ నారాయణపురం: తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చిల్లాపురం గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామ శివారులో 107 ఎకరాల భూమిని 32 మంది రైతులు సాగు చేసుకుంటుండగా, వాటిని భూదానం భూములుగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. 1950 సంవత్సరం నుంచే తమ పూర్వీకులు ఈ భూములను కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారని, 1960లో పట్టాలు కూడా పొందినట్లు తెలిపారు. భూదానం జాబితాలో చేర్చడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. భూమి కొనుగోలు పత్రాలు, పాత పహానీలు, పాస్పుస్తకాలను పరిశీలించి 22ఏ నిషేదిత జాబితా నుంచి భూములను తొలగించి 32 మంది రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. వినతిపత్రం అందించిన వారిలో శంకరప్ప, లక్ష్మయ్య, బసవరాజు, వెంకటయ్య తదితరులున్నారు.
సమస్యలు పరిష్కరించాలి
వలిగొండ : ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య కోరారు. సోమవారం వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సభ్యత్వ నమోదు చేపట్టి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని 27న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, వెంకటయ్య, శ్రీనివాస్, సైదారెడ్డి, శ్రీనివాస్, కళ్యాణి పాల్గొన్నారు.


