మునుగోడు: రైతులు తమ వ్యవసాయ భూమిలో కేవలం ఒకే పంట సాగుచేసి ఆదాయం పొందుతుంటారు. కానీ మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన రైతు జాజుల బుచ్చిరాములు తనకున్న ఏడెకరాల్లో వివిధ రకాల పంటలతోపాటు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కలబంద సాగు చేసి ఆదాయం పొందుతున్నాడు.
ఎనిమిదేళ్ల క్రితం సాగు
బుచ్చిరాములు పెద్ద కుమారుడు రాంప్రసాద్ ఎం ఫార్మసీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఉన్న అనుభవంతో తన తండ్రికి కలబంద సాగుచేస్తే బాగుటుందని సూచించాడు. ఈమేరకు ఆయన 2018లో కలబంద మొక్కలను తీసుకొచ్చి నాటాడు. అవి నాటిన ఏడాది తరువాత దిగుబడి రావడంతో వాటిని హైదరబాద్ పట్టణంలోని జ్యూస్ దుకాణాల వారికి కిలో రూ.5 నుంచి రూ.6 చొప్పున విక్రయిస్తున్నాడు. ఏడాదిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలోని కలబంద 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుండగా రూ. 50వేలకుపైగా ఆదాయం వస్తోంది.
ఎరువులు, మందుల పిచికారీ అవసరం లేదు
కలబంద సాగుకు ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు. మొక్కలు నాటే సమయంలో రైతు ఒక్కో మొక్కకు రూ. 3 చొప్పున ఖర్చుతో పాటు మొక్కలు నాటేందుకు కూలీల ఖర్చు మాత్రమే పెట్టాడు. ఆ తరువాత ఎలాంటి ఎరువులు, మందుల పిచికారీ చేయనవసరం లేదు.
అంతర పంటగా జామ
కేవలం కలబంద మాత్రమే సాగు చేయకుండా అంతర పంటగా జామ మొక్కలను నాటించాడు. ఈ మొక్కల వల్ల ఏడాదికి మరో రూ. 50వేల ఆదాయం పొందుతున్నట్లు రైతు చెబుతున్నాడు. అదేవిధంగా కలబంద మొక్కల మధ్యలో గడ్డి, కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. అవి వృథా కాకుండా 20 గొర్రెలని కొనుగోలు చేసి అందులోని గడ్డిని గ్రాసంగా వినియోగిస్తున్నాడు. దీంతో కలబంద, జామ దిగుబడితో వచ్చే ఆదాయంతో పాటు గొర్రెల పెంపకం ద్వారా మరో రూ.లక్ష అదనపు ఆదాయం వస్తుందని రైతు బుచ్చిరాములు చెబుతున్నాడు.
ఒక్కసారి నాటితే
నిరంతరం ఆదాయం
వినూత్న వ్యవసాయంతో
ఆదర్శంగా నిలుస్తున్న రైతులు


