యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం, ప్రథమ ప్రకార మండపంలోని యాగశాలలో ద్వార తోరణ పూజ, మూర్తి కుంభారాధన, పవిత్ర ఆరాధన, పవిత్ర ఆదివాసములు జరిపించారు. అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు జరి గాయి. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలమాలలతో దివ్య మనోహరంగా తీర్చిదిద్దారు. అనంతరం ప్రత్యేక బుట్టలో 108 నూలు ధారాలతో తయారుచేసిన పవిత్ర మాలలను స్వామి, అమ్మవార్ల చెంత పుణ్య జలాలతో సంప్రోక్షించి పూజలు జరిపించారు. పవిత్ర మాలలను పవిత్రేకరించేందుకు శాంతి, హోమ పూజలు జరిపారు. అర్చకులు యాగశాలలో హవన పూజలు చేసి నిత్య పూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు. పవిత్ర మాలలను, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరువీధిలో సేవోత్సవం జరిపించారు. అనంతరం వాటిని స్వామి వారి చెంత పెట్టారు.
సాయంత్రం వేళ..
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో సాయంత్రం నిత్య అర్చనలు, ఆరాధనలు, నిత్య హోమ పూజలు కొనసాగాయి. చతుస్థానార్చనలు, నిత్య హవన పూజలు కొనసాగాయి. రాత్రి వేళ బంగారు విమాన గోపురం, సుదర్శన చక్రమునకు షోడశోపచార ఆరాధన, పవిత్ర ధారణ వంటి పూజలు చేపట్టారు. పవిత్రోత్సవాలు సోమవారం ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తులకు పవిత్ర మాలధారణలతో ముగియనున్నాయి.
పాతగుట్టలో..
అనుబంధ ఆలయమైన పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండో రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో హవనం, హోమం, అర్చన వంటి పూజలు జరిపించారు. ప్రత్యేకంగా నూలు పోగులతో తయారుచేసిన పవిత్రమాలలకు యాగశాలలో పూజలు నిర్వహించారు.
లక్ష్మీనరసింహుడికి
పవిత్ర మాలలు వేసిన అర్చకులు
నేటితో ముగియనున్న ఉత్సవాలు


