చౌటుప్పల్ : సమాజ హితం కోరుతూ స్వచ్ఛందంగా సేవచేసే వారు చిరస్థాయిగా నిలుస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి గంగాపురం కిషన్రెడ్డి అన్నారు. సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సామాజిక సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న చౌటుప్పల్ జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సురేందర్ సేవలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వదేశీ సంస్థాన్ ఇండియా సంస్థ గుర్తించి మథర్ ఇండియా అవార్డు–2026కు ఎంపికచేసింది. అనివార్య కారణాలతో విద్యార్థి అక్కడికి వెళ్లలేకపోవడంతో ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంస్థ తరపున అవార్డు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు రవ్వా విజయ్కుమార్, గోశిక విఠలేశ్వర్, గుజ్జుల సురేందర్రెడ్డి, డాక్టర్ యాదగిరి, నీలం సురేష్, జయసూర్య, రామచంద్రవర్ధన్, శ్రీలతారాణి, తదితరులున్నారు.
25, 26 తేదీల్లో ఈద్ మిలాద్ ఉన్ నబీ
భువనగిరిటౌన్ : మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 25, 26 తేదీల్లో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జలీల్ పుర మస్జీద్ కమిటీ ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటలకు జలీల్ పుర మస్జీద్ ఆవరణలో ఈద్ మిలాద్ ఉన్ నబీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక జలీల్ పుర మస్జీద్ నుంచి శోభాయాత్రగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భువనగిరి పట్టణంలోని ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను, ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై సర్కారు ఊదాసీనత
ఆలేరు : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం ఊదాసీనతను ప్రదర్శిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ఆరోపించారు. ఆదివారం ఆలేరు పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండున్నరేళ్లు గడిచినా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నారు. గతంలో గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్టును 11టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని చెప్పారని, తర్వాత దానిని 6 టీఎంసీలకు, ప్రస్తుతం కేవలం 1.41 టీఎంసీలకు పరిమితం చేశారన్నారు. పటేల్గూడెం, టంగుటూరు తదితర ప్రాంతాల మీదుగా కాలువలు వినియోగంలోకి తెచ్చి దేవాదుల నీటిని ఆలేరు ప్రాంతానికి అందించాలని డిమాండ్ చేశారు. నాయకులు కల్లూరి మల్లేశం, ఎంఏ ఇక్బాల్, మొరిగాడి రమేష్, వడ్డెమాన్ బాలరాజు,గణగాని మల్లేశం, శాంత, చెన్న రాజేష్ పాల్గొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్కు రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి
మిర్యాలగూడ అర్బన్ : దళిత సాధికారత కోసం ఎస్సీ కార్పొరేషన్కు తక్షణమే రూ.1,000 కోట్లు కేటాయించి బలోపేతం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఆ సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులు లేకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ తల లేని మొండెంలా తయారైందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (అత్యాచార నిరోధక చట్టం) కేసుల ఎక్స్గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లయ్య, నాయకులు దైద దేవయ్య, బొంగరాల వెంకన్న, రెమడాల పరశురాములు పాల్గొన్నారు.


