యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సోమవారం స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో శివుడికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో, అభిషేకాలు, బిల్వార్చన పూజలు చేశారు. ముఖ మండపంలోని స్పటిక రామలింగేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు జరిపించి, అష్టోత్తర పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో వేకువజామునే స్వామి వారిని మేల్కొల్పి సుప్రభాత సేవ, అర్చనలు, ఆరాధనలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు చేపట్టారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలతో పాటుగా, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహహోమం, కల్యాణోత్సవం, గజవాహన సేవ, బ్రహ్మోత్సవం, జోడు సేవలను నిర్వహించారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.
గీతకార్మికుల సమస్యలు తెలుసుకునేందుకే యాత్ర
ఆలేరురూరల్ : గీత కార్మికుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే గీతన్నల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు.గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారానికి చేపట్టిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర సోమవారం ఆలేరు మండలం శర్బనాపురం గ్రామానికి చేరుకుంది. గీతా కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమించి అమరులైన సూదగాని ఎట్టయ్య, బండి బాలరాజు, కోటగిరి మల్లయ్య, సీస బాలరాజుల చిత్ర పటాలకు పూలమలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దూపటి వెంకటేష్, సర్పంచ్ మొగులుగాని నర్సయ్య, జిల్లా అధ్యక్షుడు రాగేరు కృష్ణయ్య, బోలగాని జయ రాములు, కొరుకొప్పుల కిష్టయ్య, చంద్రశేఖర్, సుదగాని సత్యరాజయ్య, రమేష్, మల్లేష్, మురళి, సత్తయ్య, పరుశరాములు, గడ్డమీది నరేష్, రామచంద్రం, కృష్ణ, బాలరాజు, పాండరి, బాలయ్య, బండి రాజు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
ఆలేరు : ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి పేర్కొన్నారు. బద్లావ్ జరూరీ హై అనే నినాదంతో సీపీఐ చేపట్టిన ప్రచార జాతా కార్యక్రమం సోమవారం ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైంది. ఆలేరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి ప్రచారజాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బోలగాని సత్యనారాయణ, చెక్క వెంకటేష్, కల్లెం కృష్ణ, ఇమ్రాన్, ముత్యాలు, కనకయ్య పాల్గొన్నారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి
మోత్కూరు : తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాము యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మోత్కూరులో విలేకరులతో మాట్లాడారు. యాదవ సామాజిక వర్గం నుంచి రాజకీయంగా ఎదుగుతున్న జానయ్యను అడ్డుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో రాంబాబు యాదవ్, శ్రీనివాస్, గుమ్మడెల్లి పరశురాములు, మల్లేష్ యాదవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


