చిట్యాల : దైవదర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల పట్టణ శివారులో ఆదివారం జరిగింది. రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల శివ(32) ఆదివారం తెల్లవారుజామున నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి బైక్పై వచ్చాడు. దర్శనం అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో చిట్యాల పట్టణ శివారులో భువనగిరి రోడ్డులో గల శ్రీబాల వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోకి రాగానే బైక్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో శివ తన బైక్తో పాటు ఎదురుగా వస్తున్న లారీ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా.. శివ అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. సమాచారం తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ వెంకట్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు. మృతుడి అన్న నాగరాజు కూడా కొనేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిరుమర్తి..
అదే రోడ్డు గుండా రామన్నపేట వైపు వెళ్తున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. చిట్యాల–రామన్నపేట రోడ్డులో మలుపులున్న చోట రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించాలని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన పోలీసులను కోరారు.
కారు ఢీకొని యువకుడి దుర్మరణం


