యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి కొండపైకి భక్తులను ఎలక్ట్రిక్ బస్సుల్లో తీసుకెళ్తుంటారు. ఈ విధంగానే యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులను సైతం ఎలక్ట్రిక్ బస్సుల్లోనే కొండపైకి చేర్చే విధంగా వైటీడీ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం యాదగిరిగుట్ట పట్టణం, ఆధ్యాత్మిక వాడలోని ఉన్న బస్టాండ్ల నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపిస్తే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. కొండపైన కాలుష్య నివారణతో పాటు ఖర్చు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
2వేల మంది వరకు
అన్నప్రసాదం అందించే యోచన
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో కొండకు దిగువన ఉన్న ఆధ్యాత్మిక వాడలోని అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నారు. గతంలో 1000 మందికే అన్న ప్రసాదం అందించేవారు. ఉద్ఘాటన తరువాత భక్తుల సంఖ్య పెరగడంతో 1000 మంది భక్తుల నుంచి 1500 మందికి పెంచారు. గత రెండు, మూడు సంవత్సరాల నుంచి భక్తుల రద్దీ పెరుగుతుండడంతో అన్న ప్రసాదానికి సైతం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2వేల మంది వరకు అన్నప్రసాదం అందించాలని వైటీడీ బోర్డు త్వరలో నిర్ణయించనుంది.
త్వరలో చర్చించనున్న పాలకమండలి
ఈ నెల 14న యాదగిరీశుడి ఆలయ సన్నిధిలో వైటీడీ బోర్డు పాలక మండలి సమావేశం నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైటీడీ చైర్మన్, సభ్యుల సమక్షంలో ఇందుకు సంబంధించిన ఎజెండాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలిసింది. వీటితో పాటు కొండపైన నిర్మాణం చేసే రంగ మండపం, డార్మింటరీ హాల్, వాహనాల పార్కింగ్, దీక్షా పరుల మండపం, మెట్ల మార్గంలో షెడ్డు ఏర్పాటు, లిఫ్టు వద్ద నూతన మెట్ల నిర్మాణం వంటి పనులకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయగిరి సమీపంలో శ్రీస్వామి వారికి సంబంధించిన భారీ ఆర్చిని సైతం నిర్మించేందుకు పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు.
ఫ త్వరలో నిర్ణయం తీసుకోనున్న వైటీడీ బోర్డు
ఫ భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కువ మందికి అన్నప్రసాదం అందించే యోచనలో అధికారులు


