రాజాపేట : గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు సర్పంచ్ వినూత్న ఆలోచన చేశారు. రాజాపేట మండలంలోని రేణికుంట సర్పంచ్ కర్రె వెంకటేశం.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలతోపాటు పలు అంశాలతో రూపొందించిన కరపత్రాలను పోస్టు ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికీ చేరవేస్తున్నారు. కరపత్రంలో ప్రభుత్వ పథకాలు, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, ప్రమాద బీమా పథకాలు, రక్తదాన శిబిరం నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, తడిచెత్త – పొడిచెత్త, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్ ఏర్పాటు వంటి అంశాలను వివరించారు. పోస్టు ద్వారా చేరిన ఉత్తరంతో ప్రతి వ్యక్తిలో చైతన్యం తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని సర్పంచ్ వెంకటేశం తెలిపారు.


