రైతులు సమీకృత సాగు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు సమీకృత సాగు చేపట్టాలి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సాక్షి, యాదాద్రి : రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా సమీకృత వ్యవసాయ విధానం అవలంబించి స్థిరమైన ఆదాయం పొందాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రతి రైతు తమ వ్యవసాయ క్షేత్రంలో ఇంటిగ్రేటెడ్‌ ఫార్మ్‌ పాండ్‌ ఏర్పాటు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీఏఓ రమణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా ఊంజల్‌ సేవ

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్‌ అమ్మవారిని విశేషంగా అలంకరించిన అర్చకులు భజా భజంత్రీల నడుమ తిరు మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. అనంతరం అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించిహారతినిచ్చారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

స్వాతంత్య్ర దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయండి

భువనగిరిటౌన్‌ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినీ మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించే ఈ వేడుకల్లో వీఐపీలు, ప్రజలకు ఇబ్బంది లేకుండా సీటింగ్‌తోపాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా శకటాలు, ప్రదర్శన స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్‌డీఓ క్రిష్ణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రప్రకాష్‌రెడ్డి, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

స్వావలంబన సాధించాలి

భూదాన్‌పోచంపల్లి : స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని రాష్ట్ర సెర్ప్‌ ఐటీ డైరెక్టర్‌ విశ్వేశ్వరరావు అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామాన్ని ఇందిర మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా సెర్ప్‌ ఐటీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మహిళలకు డిజిటల్‌ లావాదేవీలు, మహిళా సంఘాల అప్పులు, పొదుపు, మన పుస్తకం యాప్‌ ద్వారా చెల్లింపులపై అవగాహన కల్పించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ కోట జంగారెడ్డి, డీపీఎం సుధాకర్‌, సర్పంచ్‌ మచ్చ సుధాకర్‌, ఏపీఎం తవుర్యా నాయక్‌, సంఘబంధం అధ్యక్షురాలు ఎల్దండి ప్రశాంతి, మహిళా సంఘాల మహిళలు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

వయోవృద్ధులను ఆదుకోవాలి

భువనగిరి : వయోవృద్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం రాయగిరి గ్రామ పరిధిలో గల సహృదయ అనాథ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అనంతరం వృద్ధులు, ఆశ్రమ నిర్వాహకులతో ముచ్చడించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ్రమంలో ఉంటున్న వైకల్యం ఉన్న వయోవృద్ధులకు వైద్య సేవలందించడంతో పాటు వారి పేర్లను మిస్సింగ్‌ పోర్టులో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement