సాగు ఖర్చులు భారీగా తగ్గుతాయి
రామగిరి (నల్లగొండ): వరి, ఇతర పంటల సాగులో శ్రమతో కూడుకున్న పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ, రైతాంగానికి ఆశాకిరణంగా సగుణా రీజెనరేటివ్ టెక్నిక్ (ఎస్ఆర్టీ) నూతన వ్యవసాయ విధానం అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయకంగా చేసే దుక్కి దున్నడం, బురద చేయడం, నాట్లు వేయడం వంటి అవసరం లేకుండానే ఈ పద్ధతి ద్వారా సమర్థవంతంగా సాగు చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ‘సగుణా బాగ్’ అధినేత చంద్రశేఖర్ హరిబావు భడ్సావ్లే ఈ వినూత్న విధానాన్ని అభివృద్ధి చేయగా, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ( ఊఅౖ) దీనిని గుర్తించి ప్రశంసించింది. శుక్రవారం ఈ ఎస్ఆర్టీ సాగు విధానాన్ని నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామంలో శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆవిష్కర్త చంద్రశేఖర్ స్వయంగా హాజరై, హ్యాండ్ పుషింగ్ సీడర్ ద్వారా విత్తనాలు జల్లే విధానాన్ని ప్రదర్శించారు.
ఏమిటీ ఎస్ఆర్టీ..
● ఎస్ఆర్టి అనేది ఎలాంటి దుక్కి దున్నాల్సిన అవసరం లేని పునరుత్పత్తి వ్యవసాయ విధానం
● ఈ పద్ధతిలో పొలంలో ఒక్కసారి పర్మినెంట్ బెడ్స్ తయారు చేసుకుంటే, వాటిపైనే వరుసగా ఏళ్ల తరబడి పంటలు వేసుకోవచ్చు.
● వరితో పాటు పప్పుధాన్యాలు, పత్తి, వేరుశనగ, కూరగాయలు, మొక్కజొన్న, గోధుమలు వంటి దాదాపు 22 రకాల పంటలను ఈ బెడ్స్పై సాగు చేయొచ్చు.
ప్రయోజనాలు
● దుక్కి దున్నడం, నాట్ల శ్రమ లేకపోవడంతో పెట్టుబడి, కూలీల ఖర్చు సగానికి పైగా ఆదా అవుతుంది.
● సంప్రదాయ పద్ధతితో పోలిస్తే నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. వర్షాభావం, భారీ వర్షాలను సైతం తట్టుకునే శక్తి పంటకు లభిస్తుంది.
● పాత పంట వేళ్లను నేలలోనే ఉంచడం వల్ల సేంద్రియ కర్బనం, వానపాములు, మిత్ర సూక్ష్మజీవులు పెరిగి భూమి నిరంతరం సారవంతమవుతుంది.
● పంట 8 నుంచి 10 రోజులు త్వరగా చేతికి వస్తుంది. ఒకే సంవత్సరంలో వరుసగా 3 పంటలు తీసి ఆదాయాన్ని మూడింతలు చేసుకోవచ్చు.
● ట్రాక్టర్ల వాడకం తగ్గడం వల్ల డీజిల్ ఆదా అవ్వడమే కాక, బురద చేయకపోవడం వల్ల హానికర మిథేన్ ఉద్గారాలు నిరోధించబడతాయి.
ఫ దుక్కి దున్నడం, నాట్లు వేయడం లేకుండానే లాభసాటి పంటలు
ఫ సగుణా రీజనరేటివ్ టెక్నిక్తో సగానికి తగ్గుతున్న పెట్టుబడి
ఫ మేళ్ల దుప్పలపల్లిలో సాగు
పద్ధతిని ప్రారంభించిన
ఆవిష్కర్త చంద్రశేఖర్ భడ్సావ్లే
మేళ్ల దుప్పలపల్లిలో నిర్వహించిన ఎస్ఆర్టీ రైతు శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒకే విధానంలో పలు రకాల లాభదాయక పంటలను పండించే మార్గాలపై అవగాహన కల్పించారు. పొలంలో ప్రత్యక్ష ప్రదర్శనలు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్ఆర్టీ విధానంతో నేలను దున్నకుండానే పంటలను పండించడం ద్వారా రైతులకు శ్రమ తగ్గడంతో పాటు, ఇంధనం, సాగు ఖర్చులు భారీగా తగ్గుతాయని తెలిపారు. సహజసిద్ధంగా నేల గుల్లబారి, భూమిలోని పోషకాలు దెబ్బతినకుండా నేల సారవంతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎస్ఆర్టీ ప్రతినిధులు వెంకట్ రావు, పుట్ట జనార్దన్రెడ్డి, వినోద్ రెడ్డి, నామిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల యుగేంధర్, రైతులు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.


