సంస్థాన్ నారాయణపురం : నారాయణపురం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గుర్రం బాలరాజు పౌరాణిక మూలాశాలతో, విష్ణు అవతారం ప్రేరణతో, చేపల బొమ్మలతో తయారుచేసిన బోన్ సింగిల్ ఇక్కత్ పట్టు చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వరించింది. బోన్ సింగిల్ ఇక్కత్ చీరలో సన్నదారం వేయడంతో పాటు నిలువు పోగులు అధికంగా ఉండటం ప్రత్యేకత. సాధారణ చీరలో 72 పోగులు ఉంటే, ఈ ప్రత్యేక చీరలో 96 పోగులు ఉంటాయి. సాధారణ చీర సుమారు 550 గ్రాముల బరువు ఉండగా, బోన్ చీర 650 గ్రాముల వరకు బరువు ఉండటం విశేషం. సాధారణంగా రెండు పాపడా చెక్కలతో చీర నేస్తారు. అయితే బాలరాజు బోన్ సింగిల్ ఇక్కత్ చీరను నాలుగు పాపడా చెక్కలతో కాలు మారుస్తూ నేశారు. ఈ చీరను నేయడానికి సుమారు వారం రోజుల సమయం పడుతుందని, ఒక్కో చీర విలువ దాదాపు రూ.14 వేల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన గత 50 ఏళ్లుగా చేనేత కళనే నమ్ముకున్నారు. చేనేత సహకార సంఘంలో మేనేజర్గా, డైరెక్టర్గా కూడా సేవలందించి ఆయన పదవీ విరమణ అనంతరం కొత్త నమూనాల చీరలను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. తాను రూపొందించిన చీరకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని బాలరాజు తెలిపారు.


