రిజిస్ట్రేషన్ తప్పనిసరి
భువనగిరి: జిల్లాలోని రైతులు ఇకపై యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఆన్లైన్ యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎరువుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ, రైతులకు వారి సాగు విస్తీర్ణం మేరకు అవసరమైన ఎరువులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఫెర్టిలైజర్ యాప్ విధానం తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అమలవుతున్న ఈ పద్ధతిని మూడో విడత కింద ఈ నెల రెండో వారం నుంచి భువనగిరి జిల్లాలోనూ ప్రారంభం కానుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది.
ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అంటే..
ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్) అనేది ఎరువుల విక్రయాలు, నిల్వలు, డిమాండ్, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ. రాయితీ ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించి, అవసరానికి అనుగుణంగా నిర్ణయించిన మోతాదులో అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ విధానంలో రైతు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం ఆధారంగా ఎకరానికి నిర్దేశించిన పరిమితిలోనే రాయితీ ఎరువులను అందజేస్తారు.
బుకింగ్ విధానం
ఫ ముందుగా రైతులు తమ స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఫ ఇందులో తెలుగు భాషను
ఎంచుకునే అవకాశం ఉంది.
ఫ యాప్లో రైతులు తమ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలి.
ఫ ఒకవేళ ఆన్లైన్లో భూమి వివరాలు కనిపించకుంటే, వాటిని స్వయంగా యాప్లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు.
ఫ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత, అవసరమైన ఎరువు రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఫ ఏ డీలర్ వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారో యాప్లోనే ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయాలి.
ఫ రైతులు బుక్ చేసిన వివరాలన్నీ నేరుగా ఆ డీలర్ వద్ద ఉన్న పీవోఎస్ యంత్రంలో కనిపిస్తాయి. వాటి ఆధారంగా డీలర్ రైతులకు రాయితీ ఎరువులు అందజేస్తారు.
సహకరించాల్సిన బాధ్యత డీలర్లదే..
కొత్త విధానం కాబట్టి ప్రారంభ దశలో స్మార్ట్ఫోన్ వినియోగం తెలియని రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి డీలర్ ఇద్దరు వలంటీర్లను ఏర్పాటు చేయాలి. వాస్తవానికి మండల స్థాయిలో ప్రత్యేకంగా ఒక యూనిట్ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అది ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల తరఫున బుకింగ్ ప్రక్రియలో డీలర్లే పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు యాప్ ద్వారా యూరియా మాత్రమే కొనుగోలు చేసేవారు. ఇక నుంచి అన్ని ఎరువుల విక్రయాలు యాప్ ద్వారానే జరుగుతాయి. ఈ విధానంలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. పూర్తి వివరాల కోసం సమీపంలోని వ్యవసాయ అధికారిని, మీ–సేవ కేంద్రాన్ని లేదా పీఏసీఎస్ ను సంప్రదించవచ్చు.
– పీవీ రమణారెడ్డి, డీఏఓ
ఫ రైతుల సాగు విస్తీర్ణం, పంట
ఆధారంగా ఎరువుల కోటా
ఫ రెండో వారం నుంచి
అమలు కానున్న ఎఫ్ఎఫ్ఎస్
ఫ ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే డీలర్ల వద్ద సబ్సిడీ ఎరువుల అందజేత


