యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట–వంగపల్లి ప్రధాన రహదారిలో వంగపల్లి గ్రామం వద్ద ఉన్న రైల్వే గేట్ను బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం వరకు మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలి పారు. భువనగిరి–వంగపల్లి గ్రామాల మధ్య గల లెవల్ క్రాసింగ్ 33 టీ ఓవర్ పోలింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో ఈ రైల్వే గేట్ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారులు రాయగిరి, కందుకూరు గ్రామాల మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
శాంతిభద్రతల
పరిరక్షణే ధ్యేయం
సంస్థాన్ నారాయణపురం: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ అక్షాంశ్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిసరాలు, భద్రతా ఏర్పాట్లు, జనరల్ డైరీ (జీడీ), రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందనతో పాటు ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్రెడ్డి, స్టేషన్ ఎస్హెచ్ఓ పాండు ఉన్నారు.
సైబర్ నేరాల నివారణపై నేడు అవగాహన సదస్సు
భువనగిరిటౌన్ : సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు భువనగిరిలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి వ్యాపారులు, ప్రజలు హాజరుకావాలని పోలీసులు కోరారు. ఒటీపీ, పిన్, పాస్వర్డ్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని పోలీసులు సూచించారు. బ్యాంక్ వివరాలు, అనుమానాస్పద లింక్లు, నకిలీ కైవెసీ కాల్స్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, లోన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు సరిచూసుకోవాలని, సోషల్ మీడియా ఖాతాలకు రెండంచెల భద్రత (టూ–ఫ్యాక్టర్ అథెంటికేషన్) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రై మ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని అత్యవసర సహాయానికి డయల్ 112 ని సంప్రదించవచ్చని కోరారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. ప్రధానాలయాన్ని తెరచి సుప్రభాతం చేపట్టారు. బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలు జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన చేశారు. ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను నిర్వహించారు.


