భువనగిరిటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) జిల్లా అధ్యక్షురాలు ఇంజ హేమలత, ప్రధాన కార్యదర్శి జిట్టా రాములు ఆరోపించారు. డీహెచ్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళితులకు మొదటి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద దళిత కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ధర్నాకు ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డీ. ఇమ్రాన్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో డీహెచ్పీఎస్ నాయకులు పిట్టల శంకర్, పోతూ ప్రవీణ్, మామిడికాయల నరసింహ, చెడె సుందరయ్య, గుండెపు వెంకటయ్య, వాసం గాలయ్య, వెంకన్న, ధనమ్మ, స్వామి, ముత్యాలు, జంగయ్య, శ్యాగ జానూ, మనోహర, శ్రీను, రాములు, అండాలు, వసంత పాల్గొన్నారు.


