సాక్షి, యాదాద్రి: సంక్షేమ వసతి గృహాలు విజిట్ చేయడంలో నిర్లక్ష్యం వహించిన తొమ్మిది మంది ప్రత్యేకాధికారులకు షోకాజ్నోటీస్లు ఇవ్వాలని కలెక్టర్ అనురాగ్జయంతి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 71 హాస్టళ్లను అధికారులు సందర్శించి ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నామన్నారు. అయితే కొందరి బాధ్యతా రాహిత్యం పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 30 రోజుల సమయం ఇచ్చినప్పటికీ ప్రత్యేకాధికారులు హాస్టళ్లలను విజిట్ చేయకపోవడం, నివేదికలు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు లేకపోతే, సదరు అధికారులు రెండో శనివారం, ఆదివారం హాస్టళ్లలోనే గడపాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు.
దరఖాస్తుల పరిష్కారంపై అసంతృప్తి
సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు సంబంధించి అర్జీదారులకు కచ్చితంగా సమాధానం ఇవ్వాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే శాఖల వివరాలను బోర్డుపై ప్రదర్శించాల్సి వస్తుందన్నారు.
15 నాటికి ఫేషియల్ అటెండెన్స్
ఈనెల 15వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఆన్న్లైన్యాప్ ద్వారా ఫేషియల్ హాజరు ప్లాట్ఫామ్లోకి రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫీల్డ్లో పర్యటించే అధికారులు తమ ఉద్యోగుల పని స్వభావాన్ని బట్టి ఒక నిర్దిష్ట భవనం, మండలం, డివిజన్ లేదా జిల్లా మొత్తాన్ని హాజరు పరిధిగా నిర్ణయించుకోవచ్చని సూచించారు. 12 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్రావు, కె. వెంకారెడ్డి, డీఆర్ఓ జయమ్మ, డీఆర్డీఓ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


