యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వైకుంఠద్వారం వద్ద స్పృహతప్పి పడిపోయిన యాచకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట వైకుంఠద్వారం వద్ద సిద్దులూరి జగదీష్, సిద్దులూరి శ్రీనివాస్(65)లు కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ ఆదివారం రాత్రి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. తోటి యాచకుడు సిద్దులూరి జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే యాదగిరిగుట్ట ఎస్ఐ ఇంద్రారెడ్డిని సంప్రదించాలని సీఐ సూచించారు.
సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
హుజూర్నగర్ : ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని హుజూర్నగర్ ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎకై ్సజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ ఎకై ్సజ్ ఎస్ఐ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనఖీలు చేస్తుండగా.. మఠంపల్లి మండలం బాడవతండాకు చెందిన బానోత్ రంగా తన ద్విచక్ర వాహనంపై సారా తరలిస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బైక్ను ఢీకొట్టిన ఆవు..
దంపతులకు గాయాలు
మర్రిగూడ : మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన దంపతులు సోమవారం ద్విచక్ర వాహనంపై మాల్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలోని కాటన్ మిల్లు వద్దకు రాగానే పక్కనే పొలాల్లో నుంచి రోడ్డు పైకి అకస్మాత్తుగా వచ్చిన ఆవు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో దంపతులిద్దరు బైక్పై నుంచి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని వెంటనే మాల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
లారీ డ్రైవర్కు జైలుశిక్ష
వరంగల్ లీగల్ : అజాగ్రత్తగా, అతివేగంతో లారీ నడిపి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇరువురి మృతికి కారణమైన లారీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్డు జడ్జి బి. అనూష సోమవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని లష్కర్సింగారం ప్రాంతానికి చెందిన మునిగాల విజయ్కుమార్ తన సోదరి శ్వేతతో కలిసి 2016 అక్టోబర్ 16న ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి దేశాయిపేటకు వెళ్తుండగా.. మార్గమధ్యలో ములుగు రోడ్డు జంక్షన్ వద్ద వరంగల్ వైపు నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో విజయ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. శ్వేత చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సిలార్మియాగూడేనికి చెందిన లారీ డ్రైవర్ టి. వెంకన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో లారీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జడ్జి అనూష తీర్పు వెలువరించారు.
జూదరుల అరెస్ట్
నేరేడుచర్ల : మండలంలోని కల్లూరు గ్రామ శివారులో సోమవారం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో నేరేడుచర్ల పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,500 నగదు, 3 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చళ్లమళ్ల గోపాల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


