నల్లగొండ టూటౌన్ : రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు మనూ స్టడీ సెంటర్ నల్లగొండ సమన్వయకర్త ఎస్.కె.ఆర్. అన్సారీ తెలిపారు. ప్రవేశాలు, కోర్సులకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) విభాగంలో బీఏ హాఆనర్స్, బీకాం, బీఎస్సీ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) విభాగంలో అరబిక్, ఉర్దూ, చరిత్ర, ఇంగ్లిష్, హిందీ, ఇస్లామిక్ స్టడీస్లో ఎంఏ కోర్సులకు ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. జర్నలిజం, ఇంగ్లిష్ బోధన, బాల్య సంరక్షణ–విద్య, పాఠశాల నాయకత్వం, ఉపాధి నైపుణ్యాలు, ఉర్దూ డిప్లొమా కోర్సులు, ఉర్దూ మాధ్యమం ద్వారా ఇంగ్లిష్ ప్రావీణ్య ధ్రువపత్ర కోర్సులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. ప్రవేశాల ప్రక్రియ, కోర్సుల ప్రత్యేకతలు, విద్యార్థులకు లభించే అవకాశాలపై విశ్వవిద్యాలయ ప్రాంతీయ సంచాలకులు మజహర్ ఖాద్రీ, క్యూ డైరెక్టర్ సమీ సిద్ధిఖీ, సహాయ సంచాలకులు అమాన్ అబేద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9848514312 నంబర్ను సంప్రదించాలన్నారు.


