నకిరేకల్ : ప్రైవేట్ పాఠశాల హాస్టల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం పాఠశాల హాస్టల్లో 220 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 20 మంది విద్యార్థులకు సోమవారం తీవ్ర విరేచనాలు కావడంతో హాస్టల్ నిర్వాహకులు వెంటనే స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారు కోలుకున్న తర్వాత తిరిగి హాస్టల్కు తీసుకొచ్చారు. ఆదివారం విద్యార్థులకు ఎగ్ బిర్యాని పెట్టామని.. అది తిన్న విద్యార్థుల్లో 20 మందికి జీర్ణంకాక విరేచనాలు అయ్యాయని హాస్టల్ నిర్వాహకుడు కందాల శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.
హాస్టల్ను సందర్శించిన అధికారులు..
నల్లగొండ జిల్లా కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి స్థానిక తహసీల్దార్ యశ్వంత్రాజ్, మండల విద్యాధికారి మేక నాగయ్య ఏవీఎం పాఠశాల హాస్టల్ను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహకులు ఆహరం అందించే విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. వారి వెంట ఏవీఎం విద్యాసంస్థల అదినేత కందాల పాపిరెడ్డి, ప్రిన్సిపాల్ కందాల స్వప్నశ్రీకాంత్రెడ్డి ఉన్నారు.


