సాక్షి, యాదాద్రి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. శుక్రవారం భువనగిరిలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడతామని, ప్రతి కేంద్రంలో 1,200 మందికి మించకుండా, ఒక కుటుంబ ఓటర్లంతా ఒకే కేంద్రం పరిధిలోకి వచ్చేలా చూస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘ప్రత్యామ్నాయ’పై అవగాహన కల్పించాలి
రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుతూ జొన్నలు, పెసలు, మినుములు, కంది, ఆముదం, కూరగాయలు, పూల తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అధిక నికర ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగుకు రైతులను సన్నద్ధం చేయాలన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


