ఆలేరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, బోధనా పద్ధతులను మరింత పటిష్టం చేసేందుకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఉపాధ్యాయులతో ప్రత్యేక ప్యానెల్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా ఈ బృందాలను నియమించారు. గత విద్యా సంవత్సరంలో పనిచేసిన కమిటీలనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని, ఖాళీలు ఉంటే నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది.
నాలుస్థాయిల్లో బృందాలు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 54 మంది సభ్యులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రాథమిక స్థాయి: ప్రతి 100 పాఠశాలలకు ఒక ప్యానెల్ బృందం పనిచేస్తుంది. ఇందులో ఒక ప్రధానోపాధ్యాయుడు, భాషా పండితుడు, గణిత ఉపాధ్యాయుడు ఉంటారు. మొత్తం 4 టీమ్లు పనిచేస్తాయి.
ప్రాథమికోన్నత స్థాయి: ప్రతి 100 పాఠశాలలకు ఒక బృందం ఉంటుంది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, భాషా పండితుడు, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఉంటారు. ఒక టీమ్ పనిచేస్తుంది.
ఉన్నత పాఠశాలల స్థాయి: ప్రతి 50 బడులకు ఒక ప్యానెల్ బృందాన్ని నియమిస్తారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, ఆరుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులు, పీఈటీతో కలిపి మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 3 టీమ్లు పనిచేస్తాయి.
తనిఖీ బృందాల విధులు
బృందాలు క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి విద్యా ప్రగతిని అంచనా వేస్తాయి. ప్రతి సందర్శనలో కనీసం రెండు సబ్జెక్టుల బోధనను నిశితంగా పరిశీలిస్తాయి. వివరాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అప్లికేషన్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అమలును పరిశీలిస్తూ, బేస్లైన్ అసెస్మెంట్ ఆధారంగా ఉపాధ్యాయులకు తగిన బోధనా పద్ధతులను సూచిస్తాయి. సైన్స్ ల్యాబ్ల వినియోగం, ఉపాధ్యాయులు–విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, తాగునీరు వంటి వసతులను పరిశీలిస్తాయి. బృందాలు ప్రతి 3 నెలలకొకసారి తమ పరిధిలోని బడులను తనిఖీ చేయాలి. ప్రతి నెలా 5వ తేదీన డీఈఓకు నివేదిక సమర్పించాలి.
ఫ అకడమిక్ పర్యవేక్షణకు ప్రత్యేక తనిఖీ బృందాలు
ఫ వెనుకబడిన విద్యార్థులే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్
ఫ 2026–27 విద్యా సంవత్సరంలో అమలుకు విద్యాశాఖ ఆదేశాలు
జిల్లాలో తనిఖీ బృందాలు ఇలా..
పాఠశాల సంఖ్య విద్యార్థులు టీమ్లు
ప్రాథమిక 425 15,449 04
ప్రాథమికోన్నత 67 3,280 01
ఉన్నత 158 17,807 03


