భూదాన్పోచంపల్లి : ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో శిక్షణ పొందుతున్న బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, ఒమన్ దేశాలతో పాటు మన దేశానికి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్స్ఫోర్స్కు చెందిన 10 మంది బ్రిగేడియర్లు, కల్నల్స్, ఎయిర్ కమాండర్లు గురువారం పోచంపల్లిలో పర్యటించారు. స్థానిక చేనేత సహకార సంఘం, కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, టూరిజం పార్కును సందర్శించారు. అక్కడ మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీలో అవలంబిస్తున్న విధానాలు, మార్కెటింగ్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీరికి పోచంపల్లి ఇక్కత్కు ఉన్న గుర్తింపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్ వివరించారు. కాగా ఎంటెక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మానేసి చేనేత వృత్తిలో రాణిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్న సాయిని భరత్ను వారు అభినందిస్తూ ఆయనకు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భరత్రెడ్డి మాట్లాడుతూ.. సాంఘిక, ఆర్థికాభివృద్ధిపై అధ్యయనం నిమిత్తం స్టేట్ టూర్లో భాగంగా త్రివిధ దళాల అధికారులు పోచంపల్లికి వచ్చారని తెలిపారు. వీరికి చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ఎస్ఐలు భాస్కర్రెడ్డి, జగన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్రెడ్డి, చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, ఏడీఓ బాలమోహన్రెడ్డి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, మేనేజర్ రుద్ర అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత విశిష్టతను తెలుసుకున్న భారత్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, ఒమన్
దేశాలకు చెందిన ఆఫీసర్లు


