ఫ పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా తిప్పర్తి మం
ముందస్తు జన గణనను రాష్ట్ర సెన్సెన్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆన్లైన్లోనే కేంద్ర హోంశాఖలోని ఓఆర్జీఐకి నివేదిక పంపించారు. దీని ఆధారంగానే 2027లో జన గణనను డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో ఆ సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు పూర్తిస్థాయి జన గణన చేపట్టనున్నారు.
నల్లగొండ : 2027లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జన గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మూడు భిన్నమైన మండలాలను ఎంపిక చేసి ముందస్తు జన గణన నిర్వహించింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలాల్లో ఎన్యుమరేటర్లు ఆన్లైన్ యాప్లో జన గణన వివరాలు నమోదు చేశారు. దీనికి తోడు ఇళ్లను జియో ట్యాగింగ్ ద్వారా గూగుల్కు అనుసంధానం చేశారు. కేంద్ర హోం శాఖలోని ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఓఆర్జీఐ) ముందస్తు జన గణన నిర్వహించారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు, మామిడాల, తిప్పర్తి, జంగారెడ్డిగూడెం, సర్వారం గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ముందస్తు జన గణన నిర్వహించేందుకు గాను 40 మంది ఎన్యుమరేటర్లు, ఏడుగురు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. మొదట సూపర్వైజర్లు ఆయా మండలాల్లో గ్రామాలకు వెళ్లి ఇళ్లను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించారు. హౌజ్ లిస్టింగ్ బ్లాక్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్ను గూగుల్కు అనుసంధానం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు ముందస్తు జన గణన పూర్తిచేశారు.
మొట్టమొదటిసారి పెన్ను, పేపర్ లేకుండా డిజిటల్ విధానంలో ముందస్తు జన గణన నిర్వహించారు. ఇళ్లను జియో ట్యాగింగ్తో గుర్తించడంతో పాటు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబాలతో పాటు మిగతా వివరాలను కూడా అందులో పొందుపర్చారు. రేడియో వింటారా, ఎలాంటి భోజనం చేస్తారు, బాత్రూమ్ ఉందా, ఇంట్లో ఎన్ని గదులున్నాయి, పైళ్లెన జంటలు ఎన్ని, ఇంటికి కరెంట్ సరఫరా ఉందా, గ్యాస్, టీవీ, కంప్యూటర్, స్మార్ట్ఫోన్ వాడుతున్నారా, సైకిల్, బైక్, కారు తదితర వివరాలను సేకరించారు. ఐదు గ్రామాల్లో ఒక్క ఇంటిని కూడా వదలకుండా అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
దేశవ్యాప్తంగా 2027 జనాభా లెక్కల కోసం నిర్వహించిన ముందస్తు జన గణన విజయవంతంగా పూర్తయ్యింది. ఇందులో భాగంగా మొదట ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన తిప్పర్తి మండలంలోని ఐదు గ్రామాల్లో డిజిటల్ యాప్లో జనాభా లెక్కలు సేకరించారు. రాబోయే ప్రధాన జన గణన ప్రక్రియను మెరుగుపర్చడానికి ఈ ముందస్తు జన గణన ఎంతో ఉపయోగపడనుంది.
ఫ పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లా తిప్పర్తి మం


