
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి
ఫ పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ రవీందర్రావు
మునుగోడు: రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఇళ్లలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ అదనపు కమిషనర్ డి.రవీందర్రావు అన్నారు. ఉపాధిహామీ పథకం పనుల జాతర కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం మునుగోడు మండలం కొంపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి నిధులు వినియోగించుకోవాలన్నారు. ఇంకుడు గుంత నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సాహం అందజేస్తామన్నారు. ఇళ్లతోపాటు మురుగు కాల్వల ఎండింగ్, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో విధిగా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ కార్యాలయయంలో నూతన మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాయలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శుక్రవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. వ్రతాలకు కావల్సిన పూజా సామగ్రిని హుజూర్నగర్కు చెందిన బూర్లె ప్రతాప్ దంపతులు, సీహెచ్ ఆనంద్ దంపతులు, మేళ్లచెరువుకు చెందిన వంగవేటి సాయిబాబా దంపతులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ పాల్గొన్నారు.