
మహాశివుడికి బిల్వార్చన, అభిషేకం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్నా శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం చేసి తులసీపత్రాలతో అర్చించారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.