
మళ్లీ ‘మైక్రో’ పడగ!
సాక్షి, యాదాద్రి: మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నాయి. అధిక వడ్డీలకు విచ్చలవిడిగా రుణాలు ఇస్తున్నాయి. ఏజెంట్లు వారం వారం వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. సకాలంలో చెల్లించకపోతే అదనపువసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో అధిక వడ్డీల కారణంగా కుటుంబాలు వీధిన పడడంతో ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ సంస్థలను నిషేధించింది. ప్రస్తుతం మళ్లీ విస్తరిస్తుండడంతో వీటిని అడ్డుకోవాలని మహిళలు కోరుతున్నారు.
విచ్చలవిడి రుణాలతో..
మైక్రో ఫైనాన్స్ ప్రతినిధులు రెండు, మూడు సంఘాల నుంచి సభ్యులను తీసుకుని, ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి రుణం ఇస్తున్నారు. దీంతో సభ్యులు బ్యాంక్ లోన్లు, సీ్త్రనిధి రుణాలు, సీఐఎఫ్ రుణాల సక్రమంగా చెల్లించడం లేదు. వీఓఏలకు రుణాల రికవరీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఎక్కువగా యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు, రాజాపేట, గుండాల, వలిగొండ, భువనగిరి, యాదగిరిగుట్టలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇస్తున్నాయి.
రాజకీయ ఒత్తిడి
ఓ మైక్రో ఫైనాన్స్ ఇస్తున్న రుణాలపై ప్రశ్నించిన ఏపీఎం, వీఓఏలకు రాజకీయ బెదిరింపులు వస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ను ప్రశ్నించినందుకు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో యాదగిరిగుట్ట మండలం వీఓలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పురుషులతో కూడా సంఘాల ఏర్పాటు
యాదగిరిగుట్ట మండలంలో మహిళలతోపాటు పురుషులతో కూడా సంఘాలు చేసి అప్పులు ఇచ్చేందుకు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో నూతనంగా మగవారికి కూడా సంఘాలు చేస్తూ, వారికి రుణాలు ఇస్తున్నట్లు తెలసింది.
రూ.5వేల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు
మైక్రో ఫైనాన్స్లు రూ.5వేల నుంచి రూ.2లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఆస్తులు, డాక్యుమెంట్లు పూచీకత్తుగా పెట్టుకుంటున్నారు. తీసుకున్న రుణం వాయిదాలను వారం వారం వచ్చి వసూలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు రికవరీ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. మహిళలు సమభావన సంఘాల్లో నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వారం వారం కిస్తులు చెల్లించడానికి అప్పులు తీసుకున్న వారు మళ్లీ కొత్త రుణాలు చేస్తూ అప్పుల చక్రంలో చిక్కుకుంటున్నారు.
గ్రామాల్లో విస్తరిస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు
వారానికి ఒక వాయిదా
చెల్లించేలా నిబంధనలు
చెల్లించడంలో జాప్యమైతే అదనపు
వసూళ్లకు పాల్పడుతున్న సంస్థలు
కుటుంబాలు వీధిన పడుతున్నాయని వాపోతున్న మహిళలు
ఇబ్బందులు పడుతున్నాం
గ్రామాల్లో కొత్తగా మైక్రో ఫైనాన్స్ వారు ఎక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ సంఘాల నుంచి లోన్లు తీసుకున్న వారు కూడా ప్రైవేట్లో తీసుకుంటున్నారు. దీంతో ఈ రెండు లోన్లు కట్టలేని స్థితిలో ఉన్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులో నెల నెలా కట్టాల్సిన వాయిదాల్లో ఇబ్బంది పడాల్సి వస్తోంది.
– సంధ్య, కాచారం, వీఓఏ
మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అరికట్టాలి
మైక్రో ఫైనాన్స్ వాళ్లు గ్రామాల్లోకి వచ్చి మగవాళ్ల పేరు మీద సంఘాలు చేసి లోన్లు ఇస్తామని చెబుతున్నారు. మా గ్రామంలో ఐదుగురు మగవారితో సంఘం ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యుడికి రూ.50 వేల వరకు లోన్ ఇస్తామని రాసుకున్నారు. ఈ ప్రైవేట్ సంస్థల ఆగడాలను అధికారులు అరికట్టాలి.
– సునీత, మాసాయిపేట, వీఓఏ

మళ్లీ ‘మైక్రో’ పడగ!

మళ్లీ ‘మైక్రో’ పడగ!