తాడేపల్లిగూడెం అర్బన్: యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్యకు కారణమైన నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రవిచంద్ర బుధవారం నిర్వహించిన విలేకరులతో మాట్లాడుతూ.. బాలకృష్ణ వర్ధన్ సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితులు తమ్మిశెట్టి సురేష్, దేవా శివలను అరెస్టు చేశామన్నారు. గతంలో రంగా సురేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్లో వర్ధన్ రిపోర్టర్గా చేశాడన్నారు. అతనికి నెలవారీ వేతనం చెల్లించకపోగా... వేతనం ఇవ్వమని అడిగితే కులం పేరుతో దూషించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో దూషించుకోవడం వల్ల మనస్తాపం చెంది వర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు.


