వైఎస్సార్సీపీ ఉండి సమన్వయకర్త యోగేంద్రకుమార్
ఆకివీడు: నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి వైఎస్సార్సీపీ జెండాను ఉండి నియోజకవర్గంలో ఎగురవేద్దామని నియోజకవర్గ సమన్వయకర్త మంతెన యోగేంద్రకుమార్ (బాబు) పిలుపునిచ్చారు. స్థానిక నగర పంచాయతీలో ఆదివారం ఆయన విస్తతంగా పర్యటించారు. గ్రామ దేవత పెద్దింటి అమ్మవారిని దర్శించుకున్నారు, అభయాంజనేయస్వామి దీవెనలు పొందారు. అనంతరం ఏఎంసీ మాజీ చైర్మన్ మోటుపల్లి గంగాధరరావు నివాసానికి వెళ్లి తనకు సహకరించాలని కోరారు. అలాగే ముస్లిం నాయకుడు ఎండీ మదీనీ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎండీ మస్తాన్వలీ, వానపల్లి బాబూరావు, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, శ్రీనివాస్, ప్రముఖ వైద్యుడు ఎండీ బిలాల్, పార్టీ మండల అధ్యక్షుడు నంద్యాల సీతారామయ్యలను కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగర పంచాయతీ వైస్చైర్మన్ పుప్పాల పండు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎస్కే రసూల్బీబీ హుస్సేన్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కేశిరెడ్డి మురళీతో మాట్లాడి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా యోగేంద్రకుమార్ మాట్లాడుతూ ఆకివీడులో వైఎస్సార్సీపీ బలాన్ని మరింత పటిష్టం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. తనకు పూర్తి సహకారం అందజేస్తానన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు నిమ్మల నాగు, ఎండీ జక్కీ, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పడాల కిషోర్రెడ్డి, మెప్మా మాజీ అధ్యక్షురాలు మోరా జ్యోతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గుర్రం హరనాథ్ తదితరులు ఉన్నారు.


