బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన మోతుగూడెంకు చెందిన నాలుగేళ్ల కొండరెడ్డి బాలిక మృతిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ యు.శోభ, జిల్లా మలేరియా అధికారి వి.ఎస్.ఎస్.ప్రసాద్, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు, కేఆర్ పురం ఐటిడిఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ సుమతి మంగళవారం బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సిహెచ్సీ) సందర్శించారు. ఈ సందర్భంగా బాలిక మృతికి గల కారణాలపై అక్కడి వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం డిఎంహెచ్ఓ శోభ మోతుగూడెం గ్రామాన్ని సందర్శించారు. మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు గురుగుంట్ల వెంకటరెడ్డి, సునీతలను పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ వసుంధర, ప్రోగ్రామ్ ఆఫీసర్ పూజ, అంతర్వేదిగూడెం పిహెచ్సీ వైద్యాధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


