తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను శుక్రవారం సర్వశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, వృత్తి విద్య ల్యాబ్, ఇతర విద్యా సౌకర్యాలను పరిశీలించారు. తొలుత నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ హాలును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ–2 పీఎంకే జ్యోతి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, ఉపాధ్యాయులు పి.శశికుమార్, ఎస్. ఆనందరావు, డి.కృష్ణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టి.నరసాపురం: ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఉత్తర్వులను మండలంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని ఎంఈఓ టి.రామ్మూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బొర్రంపాలెం గ్రామానికి చెందిన జి.పాండురంగ పీజీఆర్ఎస్ ద్వారా చేసిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు స్పందించినట్లు పేర్కొన్నారు. ఆర్టీఈ చట్టం అమలుతో పాటు పాఠశాలల్లోని, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలు, వారి విద్యార్హతలు, జీతభత్యాల వివరాలను నోటీస్ బోర్డులపై స్పష్టంగా ఉంచాలని స్పష్టం చేశారు.


