పాలకొల్లు సెంట్రల్: గతంలోని అన్ని ప్రభుత్వాలు ఆక్వా రైతులను నిర్లక్ష్యం చేస్తే, వారిని అన్నివిధాలా ఆదుకున్న ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు అన్నారు. శనివారం పాలకొల్లులోని అడబాల మినీ గార్డెన్స్లో నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈనెల 15న ఆక్వా రైతుల సమస్యలపై జిల్లాకు రానున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించారు.
జగన్ హామీతోనే నాడు విద్యుత్ ధరల తగ్గింపు
ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తమ సమస్యలను పాదయాత్రలో జగన్ దృష్టికి తీసుకువెళ్లగా రూ.3.85గా ఉన్న విద్యుత్ యూనిట్ ధరను అధికారంలోకి రాగానే రూ.1.50 లకే ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ ధరను రూ.2కు తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఆక్వా రంగానికి అండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్సడా సంస్థను ఏర్పాటు చేసి, దానికి ఆయనే చైర్మన్గా ఉంటూ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రసాదరాజు తెలిపారు. ఫీడ్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ధరలు తగ్గించకుండా నిఘా పెట్టారన్నారు. ఆక్వా ఉత్పత్తులకు డొమెస్టిక్ సేల్స్ ద్వారా అదనపు ఆదాయం కల్పించాలనే సంకల్పంతో స్థానికంగా మార్కెట్లను ఏర్పాటు చేశారని చెప్పారు.
ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ
కూటమి నాయకులవే..
ప్రస్తుతం రాష్ట్రంలోని ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లలో మెజారిటీ చంద్రబాబు సామాజికవర్గానికి, టీడీపీ నాయకులకు చెందినవేనని ప్రసాద రాజు ఆరోపించారు. పార్టీ నడపడానికి వారి నుంచి నిధులు వసూలు చేసే చంద్రబాబు.. ఫీడ్ ధరలు తగ్గించాలని, రొయ్యల ధరలు పెంచాలని వారిని ఎలా నిలదీయగలరని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఫీడ్ ధరలను కేజీకి రూ.14 పెంచితే, కంటితుడుపు చర్యగా రూ.4 తగ్గించాలని సిఫార్సు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న కంపెనీలు కేవలం రూ.2 మాత్రమే తగ్గించి చేతులు దులుపుకున్నాయని మండిపడ్డారు.
15న భీమవరానికి వైఎస్ జగన్ రాక
నాడు జగనన్న ప్రకటనతో విద్యుత్ ధరలు తగ్గినట్టే.. నేడు కూడా అదే పరిస్థితి పునరావృతం కానుందని ప్రసాదరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 15న వైఎస్ జగన్ భీమవరం రానున్నారని, ఆయన రాకతో ఫీడ్ ధరలు తగ్గుతాయని, రొయ్యల కొనుగోలు ధరలు పెరుగుతాయని అన్నారు.
జగన్ హయాంలోనే అన్నివర్గాలకు న్యాయం
నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో యువత, మహిళలు, బీసీలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు.
జగన్ పర్యటనను జయప్రదం చేయాలి
నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు మాట్లాడుతూ.. జగన్కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆక్వా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, ప్రోగ్రామ్ ఇన్చార్జి చింతలపాటి శ్రీనివాసరాజు, సీనియర్ నాయకులు మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్, కుమార దత్తాత్రేయవర్మ, యడ్ల తాతాజీ, జెడ్పీటీసీలు నడపన గోవిందరాజులు నాయుడు, గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీలు యినకొండ ధనలక్ష్మీ రవికుమార్, సబ్బితి సుమంగళి, పట్టణ, మండలాల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, పెన్మెత్స ఏసురాజు, కొర్రపాటి వీరాస్వామి, కర్రా జయసరిత, మద్దా చంద్రకళ, నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
పాలకొల్లులో సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాదరాజు, చిత్రంలో మురళీకృష్ణంరాజు, గుడాల గోపి, ఉమాబాల, పాల్గొన్న పార్టీ శ్రేణులు


