పాలకొల్లు సెంట్రల్ : కళలకు నిలయం కళాకారులకు ఆలయం వంటి క్షీరపురిలో కళానైపుణ్యానికి ఇక్కడి కళాభిమానులు, కళాకారులు ఎంతో వన్నె తెస్తున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. శుక్రవారం పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ వద్ద అడబాల థియేటర్స్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో కళాకారులను అందించిన ఘనత ఈ క్షీరపురిదన్నారు. నాటిక రంగం నుండి ఎంతోమంది కళాకారులు సినీ ఇండస్ట్రీలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేశారన్నారు. మొదటి రోజు ఉషోదయ కళానికేతన్ కట్రపాడు ఆధ్వర్యంలో మంచి మనసులు నాటిక, అరవింద్ ఆర్డ్స్ తాడేపల్లి వారు నిర్వహించిన దేవుణ్ణి చూసా నాటికలు కళాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ భీమవరం అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్, కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ, యడ్ల తాతాజీ, జక్కంపూడి కుమార్, కోరాడ శ్రీనివాసరావు, మానాపురం సత్యనారాయణ, ఖండవల్లి వాసు, మేడికొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


