ఏలూరు (ఆర్ఆర్పేట): జీఎస్టీ అమలు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత పారదర్శకంగా మారాయని ఏలూరు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జున రావు తెలిపారు. స్థానిక సీఆర్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో దక్షిణ భారత రాష్ట్రాలలో జీఎస్టీ సంస్కరణలు, వాటి సామాజిక–ఆర్థిక ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం కళాశాల లైబ్రరీ సెమినార్ హాల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానం అమలులోకి వచ్చి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కీనోట్ స్పీకర్ రమణారావు, కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ డీవీ సుబ్బారావు మాట్లాడుతూ జీఎస్టీ విధానం, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పన్ను సంస్కరణల అవసరం, భవిష్యత్తు అవకాశాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో యువ ఆడిటర్ రమణ చైతన్య, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ బట్టు నాగరాజు, ఎంబీఏ విభాగాధిపతి కేవీ శ్రీధర్, కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు పాల్గొన్నారు.


