
ఉసూరుమనిపింఛెన్
పెండింగ్లో వేల దరఖాస్తులు
ఉసూరుమనిపింఛెన్
కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ హామీ ఊసే లేదు. అర్హత ఉన్నా సాయం అందక వేలాది మంది నష్టపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. ఏడాదిన్నర కాలంలో కొత్త మంజూరు ఏమీ లేకపోయినా ప్రతి నెలా పింఛన్ల పేరిట కూటమి నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
దళితులు, బడుగు, బల హీన, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తోంది. సూపర్ 6 పథకాల్లో కూడా నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని ఇంకా అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేస్తూ ప్రజలను మోసం చేయడం సమంజసం కాదు.
– షేక్ చాన్ బీబీ, పాలకొల్లు
50 ఏళ్ల వయసు దాటిన వారికి పింఛన్ ఇస్తానని ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం మోసపూరితం. ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్ మంజూరు చేయాలి.
– కొరపాటి అనిత, గృహిణి, చెరుకువాడ
సాక్షి, భీమవరం: కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ హామీ ఊసే లేదు. అర్హత ఉన్నా సాయం అందక వేలాది మంది నష్టపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. ఏడాదిన్నర కాలంలో కొత్త మంజూరు ఏమీ లేకపోయినా ప్రతి నెలా పింఛన్ల పేరిట కూటమి నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
కార్యాలయాల చుట్టూ తిరుగుతూ..
50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్కళ్యాణ్, కూటమి నేతలు ఊరూరా ఊదరగొట్టారు. పాలన చేపట్టి ఏడాదిన్నర దాటినా ఇంకా ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రెండున్నర లక్షల మంది వరకు ఉండగా వారిలో 80 శాతం మంది అర్హులుంటారని అంచనా. ఎన్నికల హామీ అమలుకోసం ఆయావర్గాల వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్త పింఛన్ల ఊసే ఎత్తకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పింఛన్ సాయం కోరుతూ సచివాయాలు, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళుతుండగా ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెబుతున్నారని వారు వాపోతున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో.. గత వైఎస్సార్సీపీ పాలనలో ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు సిబ్బంది వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు. రాజకీయాలు, కులమత వర్గాలకు అతీతంగా, పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరిగేది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి జిల్లాలో సామాజిక పింఛన్లు దాదాపు 1.32 లక్షల వరకు ఉండగా ఐదేళ్లలో వాటి సంఖ్య 2,32,885 పెరగడం గమనార్హం. ఎన్నికలకు ముందు గత జనవరిలోనూ జిల్లాలో 4,274 కొత్త పింఛన్లు మంజూరు చేశారు.
కూటమి నేతల హడావుడి
కొత్త పథకాలు ప్రవేశపెట్టే సమయంలో ప్రజాప్రతినిధులు, అధికార పక్షం నేతలు హాజరై వాటిని లాంఛనంగా ప్రారంభించడం పరిపాటి. తర్వాత నుంచి యథా ప్రకారం ఆ కార్యక్రమం సాగిపోతుంటుంది. కాగా కూటమి తీరు ఇందుకు భిన్నంగా ఉంది. సూపర్ సిక్స్ హామీల అమలులో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతినెలా పింఛన్ల పంపిణీని ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. సచివాలయ సిబ్బంది వెంట కూటమి నేతలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సాయం అందిస్తుండటం చూసి జనం ముక్కన వేలేసుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. మండల, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో పేదలు దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ఏడాదిన్నర కాలంలో జిల్లావ్యాప్తంగా 28 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అంచనా. వీరంతా సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ప్రభుత్వం ఇంకా కొత్త శాంక్షన్ ఇవ్వలేదని ఉద్యోగులు వారిని వెనక్కి పంపిస్తున్నారు. తమకు అర్హత ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పింఛన్ సాయం అందక నష్టపోతున్నామని పేదవర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటికి కోత పెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటికి జిల్లాలో 2,32,885 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,26,995 చేరింది. ఈ మేరకు 5,890 పింఛన్లు తగ్గాయి. తాజాగా దివ్యాంగుల పింఛన్లకు కోతపెట్టే పనిలో ప్రభుత్వం ఉండటం గమనార్హం.
కొత్త పింఛన్లకు ‘చంద్ర’ గ్రహణం
పెండింగ్లో 28వేలకు పైగా దరఖాస్తులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి..
ఆయా సామాజిక వర్గాలకు చెందిన 2.5 లక్షల మంది ఎదురుచూపు
అర్హత ఉన్నా సాయం అందక నష్టపోతున్న పేదలు
ఏడాదిన్నరలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వని కూటమి సర్కారు

ఉసూరుమనిపింఛెన్

ఉసూరుమనిపింఛెన్

ఉసూరుమనిపింఛెన్