
గోదావరి వడివడి.. కొల్లేరులో అలజడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/కైకలూరు/పోలవరం/కుక్కునూరు: ఓ వైపు గోదావరి ఉధృతం.. మరోవైపు ప్రధాన కాలువల నుంచి కొల్లేరుకు భారీగా వచ్చి చేరుతున్న నీటితో ఏలూరు జిల్లాను వరద చుట్టుముడుతోంది. ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో గోదావరి, కొల్లేరు నీరు చేరడంతో లంక, ముంపు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. అల్పపీడన ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, శబరి నదులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు రోజుల్లో మొత్తంగా 9 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరింది. సోమవారం భద్రాచలం వద్ద 38 అడుగుల మేర నీటిమట్టం చేరింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 31.050 మీటర్ల ఎత్తు నుంచి 6,70,355 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 48 గంటల పాటు వరద ఉధృతి కొనసాగి మంగళవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. గోదావరి, శబరికి ఎగువ నుంచి 15 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటి ప్రవా హం కొనసాగుతుందని అంచనా.
ముంపు మండలాల్లో..
వేలేరుపాడు మండలంలోని కొయిదా, కట్కూరు, సిద్ధారం, కాచారం, పూసుకుంది, తాళ్ల గొంది,పేరంటపల్లి, టేకుపల్లి, టేకూరు, బుర్రారెడ్డిగూడెం, ఎర్రమెట్ట, ఎడవల్లి, చిట్టం రెడ్డిపాలెం, మరో ఐదు గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగి పోయాయి. ఎద్దుల వాగు వంతెన నీట మునగడంతో నాటు పడవ ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే వేలేరుపాడులో పునరావాస శిబిరం ఏర్పాటు చేసి ఐదు గ్రామాల ప్రజలను తరలించడంపై అధికారులు దృష్టి సారించారు. కుక్కునూరులో గుండేటివాగు వంతెన నీటముగింది.
ఉధృతంగా కొల్లేరు
కొల్లేరు పూర్తి జలకళతో నిండుకుని రోడ్లపైకి నీరు చేరుతోంది. కృష్ణా జిల్లా నుంచి బుడ మేరు, రామిలేరు, తెలంగాణ నుంచి మున్నేరు, తమ్మిలేరుకు వరద ప్రవాహం ఉండటంతో అన్ని కాలువలు కొల్లేరులో కలుస్తున్నాయి. దీంతో ఆదివారం నుంచి కొల్లేరు లంక గ్రామాల్లో అలజడి మొదలైంది. సోమవారం మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్ల ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. నీరంతా కై కలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పెదఎడ్లగాడి, చినఎడ్లగాడి, పోల్రాజ్ కాల్వల ద్వారా ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తుంది. వాస్తవానికి కొల్లేరుకు చేరుతున్న 1.10 లక్షల క్యూసెక్కుల నీటిలో 12 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే దిగువకు వస్తుంది.
పెనుమాకలంకకు రాకపోకలు బంద్
మండవల్లి మండలం పెదఎడ్లగాడి నుంచి పెనుమాకలంక, నందిగామలకం, ఇంగిళిపాకలంక గ్రామాలకు చేరే రహదారిపై మూడు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. పెదఎడ్లగాడి నుంచి పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పెనుమాకలంక రహదారి వద్ద ప్రవేశం లేదని పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. మండవల్లి మండలంలో పులపర్రు, కొవ్వాడలంక, మణుగునూరులంక, తక్కెళ్లపాడు, చింతపాడు గ్రా మాలు, కై కలూరు మండలంలో పందిరిపల్లిగూడెం, కొట్డాడ, శృంగవరప్పాడు, పెంచికలమర్రు గ్రామా లు నీట మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క
కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ప్రధా న పెదఎడ్లగాడి వంతెనకు 56 ఖానాలకు గాను 20 ఖానాల్లో గుర్రపుడెక్క పేరుకుపోయింది. పొక్లెయిన్ తో డెక్కను తొలగిస్తున్నారు. గుర్రపుడెక్క పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కొల్లేరు పరీవాహక ప్రజలు కోరుతున్నారు. డెక్కతో పచ్చటి తివాచీ పరుచుకున్నట్టు కొల్లేరు కనిపిస్తోంది.
జిల్లాను చుట్టుముడుతున్న వరద
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు నుంచి కొల్లేరులోకి నీరు
పెనుమాకలంకకు రాకపోకలు బంద్
వేలేరుపాడులో ముంపులోనే ఎద్దులవాగు వంతెన
పోలవరం నుంచి 6.70 లక్షల క్యూసెక్కులు దిగువకు..