
ఉత్తమ ప్రదర్శనగా ‘స్వేచ్ఛ’ నాటిక
యలమంచిలి: కొంతేరు గ్రామంలోని శ్రీ పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిర్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రదర్శితమైన 43వ అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే ప్రదర్శించిన స్వేచ్ఛ నాటిక ఉత్తమ ప్రదర్శనగా మొదటి బహుమతి గెలుచుకుంది. విజేతలకు యూత్ కమిటీ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పాలకొల్లు చాంబర్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ చేగొండి సత్యనారాయణమూర్తి బహుమతులు అందజేశారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్–కొలకులూరు వారి జనరల్ భోగీలు నిలువగా, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నటీ నట సమాక్య–పాలకొల్లు వారి అనూహ్యం నాటిక నిలిచింది. జ్యూరీ విభాగంలో కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి ద్వారబంధాల చంద్రయ్యనాయుడు నాటిక నిలిచింది. ఈ పోటీలకు కొంతేటి సర్వేశలింగం, గంటా రామమోహనరావు, కొడమంచిలి సత్యప్రసాద్ గుణ నిర్ణేతలుగా వ్యవహరించారు.
నిద్రమత్తులో డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి
పాలకోడేరు: నిద్ర మత్తులో డాబాపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మోగల్లులో జరిగింది. పాలకోడేరు ఎస్సై ఎం.రవి వర్మ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు నాగేశ్వరరావు (45) ఆదివారం రాత్రి ఎప్పటిలాగానే డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జన నిమిత్తం వేకువజామున కిందికి దిగే క్రమంలో పైనుంచి జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవివర్మ చెప్పారు.

ఉత్తమ ప్రదర్శనగా ‘స్వేచ్ఛ’ నాటిక