
పేదల ఇళ్ల తొలగింపు దుర్మార్గం
భీమవరం: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను తొలగించడానికి అక్కడి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక శాఖను అప్పగించినట్టుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్ దుయ్యబట్టారు. పేదల ఇళ్ల తొలగింపును నిరసిస్తూ శనివారం భీమవరం ప్రకాశంచౌక్లో నిరసన తెలిపారు. పాలకోడేరు మండలంలో ఎన్నో ఏళ్లుగా పేదలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తుంటే అధికార దురహంకారంతో ఉండి ఎమ్మెల్యే దుర్యోధన పర్వానికి తెరదీశారని మండిపడ్డారు. ఇళ్లు తొలగింపు సందర్భాల్లో భౌతిక దాడుల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పేదలపై దాడులు, దౌర్జన్యాలు తప్ప ఒనగూరిందేమి లేదన్నారు. పాలకోడేరులో పుంత పొడవునా సుమారు 50 సెంట్ల పోరంబోకు భూమిని పెత్తందారులు ఆక్రమించుకుని పొలాల్లో కలిపేసుకున్నారని, వారి జోలికి వెళ్లే దమ్ము ఉండి ఎమ్మెల్యేకు లేదని విరుచుకుపడ్డారు. పేదలపై ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే ప్రభుత్వ పతనం తప్పదని గ్రహించాలన్నారు. సీపీఎం జిల్లా నాయకులు బి.వాసుదేవరావు, ఎం. వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డి.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
బొండాడలో నిరసన
కాళ్ల: పేదల ఇళ్ల తొలగింపు దారుణమని సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని బొండాడ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పోలీసులు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఇంత దారుణానికి ఒడిగట్టడం సరికాదన్నారు. ఇలానే ఇళ్లు కూల్చుకుంటే పోతే రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గం శ్మశానంగా మారుతుందన్నారు. పే దలంటే చులకనగా చూస్తున్న ఎమ్మెల్యేకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అధిక సంఖ్యలో పేదలు పాల్గొన్నారు.

పేదల ఇళ్ల తొలగింపు దుర్మార్గం