న్యూశాయంపేట: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాధారణ వర్షపాతం నమోదైంది. సగటున 9.6 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఉక్కపోత, ఎండల తీవ్రత నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. జిల్లాలోని వరంగల్ నగరంలో 38.0 మిల్లీ మీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదు కాగా, ఖిలా వరంగల్ మండలంలో 19.6 మి.మీ, నర్సంపేట (3.4), ఖానాపురం (7.2), చెన్నారావుపేట (11.4), సంగెం (6.8), వర్ధన్నపేట (3.8), రాయపర్తి (4.6), పర్వతగిరి (3.8), నెక్కొండ (8.2), గీసుకొండ (14.2), దుగ్గొండి (2.4), నల్లబెల్లిలో 1.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎండల ధాటికి ఎండిపోతున్న పత్తి, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ప్రాణవాయువులా పనిచేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


