న్యూస్రీల్
సాక్షి, వరంగల్:
ఉత్తర తెలంగాణకు దిక్సూచిగా వరంగల్ నగరం భవిష్యత్లో మెగా కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలు, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ, కాజీపేట రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు వరంగల్ ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, రియల్ ఎస్టేట్ రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉంది. రానున్న ఐదేళ్లలో వరంగల్ను ఉత్తర తెలంగాణ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు మెగా ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. 68.015 కిలోమీటర్ల కరీంనగర్–వరంగల్ (ఎన్–563) జాతీయ రహదారి పనులు, వరంగల్–ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే (ఎన్హెచ్–163జీ) రహదారి నిర్మాణ పనులు పూర్తయితే మెగా కనెక్టివిటీ వరంగల్కు అనుసంధానం కానుంది. ఇప్పటికే హైదరాబాద్– వరంగల్ (ఎన్హెచ్ 163), ప్రస్తుత వరంగల్ ఎన్హెచ్ 163 వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాతీయ రహదారులతో పాటు మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మొదలు కానుండడంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయి.
కాకతీయ టెక్స్టైల్ పార్కులోకి
మరిన్ని కంపెనీలు..
రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఒకే నగరంలో అందుబాటులో ఉండటంతో వరంగల్ భవిష్యత్లో లాజిస్టిక్స్ హబ్గా మారనుంది. టూరిస్ట్ హబ్గాను నిలవనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశ్రామిక వస్తువుల రవాణా వేగవంతమవుతుంది. పీఎం మిత్ర కింద ఎంపికైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోకి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే, వరంగల్ కనెక్టివిటీకి రూ. 13,976 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేశామని.. లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమాధానం ఇవ్వడంతో వరంగల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
● రూ.2,414.46 కోట్లతో 68 కిలోమీటర్ల నిడివితో ఎన్హెచ్–563 కరీంనగర్–వరంగల్ నిర్మాణ పనులు దాదాపు 70 శాతానికిపైగా పూర్తి అయ్యాయి.
● రూ.3,718 కోట్లతో ఎన్హెచ్–163జీ వరంగల్–ఖమ్మం హైవే నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా చేపట్టారు. భారత్ మాల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్ వే పనుల నిర్మాణం ప్రారంభ దశలో ఉంది.
● రూ.2,972 కోట్లతో 201 కిలోమీటర్ల బల్లార్షా–కాజీపేట నాలుగో రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 118 కిలోమీటర్ల కాజీపేట–విజయవాడ మూడో రైల్వే లేన్ పూర్తవుతుంది. రూ.208 కోట్లతో 21 కిలోమీటర్ల ఆర్ఓఆర్ (రైల్ ఓవర్ రైల్) పూర్తి 2026లో అందుబాటులోకి వచ్చింది. దీంతో కాజీపేట జంక్షన్లో రైళ్ల నిలిపివేత తగ్గింది.
● 949.44 ఎకరాల విస్తీర్ణమున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే రూ.203.49 కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు పిలిచింది. ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేశాక పనులు ప్రారంభం కానున్నాయి. రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణాలు సులభం అవుతాయి.
రూ.13,976 కోట్ల విలువైన ప్రాజెక్టులతో వరంగల్కు మెగా కనెక్టివిటీ
రోడ్లు, రైలు, విమాన మార్గాల
అభివృద్ధి దిశగా అడుగులు
పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి,
పర్యాటకానికి భారీ ఊతం
లాజిస్టిక్స్ హబ్ నగరాల జాబితాలో ఓరుగల్లు చేరే
అవకాశం
లోక్సభలో కడియం కావ్య
అడిగిన ప్రశ్నకు కేంద్రం జవాబు
వరంగల్ మెగా కనెక్టివిటీ ఇలా..


