హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
వరంగల్ చౌరస్తా : రైతులను, కార్మికులను అధోగతి పాలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. సోమవారం వరంగల్ హెడ్ఫోస్టాఫీస్ సెంటర్ల రాస్తారోకో నిర్వహించగా పోలీసులు అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వదేశీ నినాదం పేరు చెప్పి ఆచరణలో అమెరికా లాంటి విదేశాలకు అనుకూలంగా విధానాల రూపకల్పన చేసి రైతులను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతోపాటు వ్యవసాయాన్ని వదిలి కూలీలుగా మారిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్, కుసుంబ గంగాధర్, దయాకర్, జిల్లా కన్వీనర్లు చుక్క మొగిలి, శ్రీనివాస్, బాలరాజు, సూరి, భాస్కర్, కుమార్, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి పాశం రవి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాకెట్ పడితే పతకం ఖాయం!
● బ్యాడ్మింటన్లో వేదితారెడ్డి ప్రతిభ
● జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో
20 వరకు పతకాలు
● అండర్–13లో జాతీయస్థాయిలో
26వ ర్యాంక్
నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బ్యాడ్మింటన్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తోంది. బ్యాడ్మింటన్ కోర్టులో దిగి బ్యాట్ (రాకెట్) పడితే పతకం ఖాయం అన్నట్లుగా పట్టుదలతో ఆడి పతకాలు సాధిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. నర్సంపేట పట్టణానికి చెందిన కట్కూరి సురేష్రెడ్డి, మమత దంపతుల కుమార్తె వేదితారెడ్డి ప్రస్తుతం 8వ తరగతి చదువుతుంది. మొదటి నుంచి బ్యాడ్మింటన్పై ఆసక్తి ఉండేది. ఆటల్లో ప్రతిభ కనబరుస్తుండటాన్ని తల్లిదండ్రులు గుర్తించి హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అండర్ 13 విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తూ సుమారు 20 పతకాలు సాధించింది. ఇటీవల హైదరాబాద్లో ప్రభుత్వ సహకారంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునెక్స్ సన్రైస్ 11వ రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ చాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి ఒలింపిక్ ప్లేయర్ తనీషాక్రాప్టో చేతుల మీదుగా బహుమతి అందుకుంది. గతంలో ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లోనూ రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి, జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. పట్టుదలతో పతకాలు సాధిస్తుండటంతో పట్టణానికి చెందిన పలువురు అభినందిస్తున్నారు.
ఒలింపిక్స్లో ఆడటమే లక్ష్యం
వేదితారెడ్డి బ్యాడ్మింటన్పై మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తన ప్రతిభను గుర్తించి హైదరాబాద్లోని ఓ అకాడమీలో కోచ్ నిఖిల్కుమార్ పర్యవేక్షణలో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇండియా తరఫున ఒలింపిక్స్లో ఆడటమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.
–వేదితారెడ్డి తండ్రి సురేష్రెడ్డి


