హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రం శ్రీనివాసకాలనీ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్రెడ్డి సిబ్బందితో కలిసి యంత్రాల సాయంతో నిర్మాణాలను తొలగించారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఆక్రమణదారులు స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ప్రభుత్వ భూములతో పాటు రహదారులను సైతం ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందగా కూల్చివేతలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను కొనుగోలు చేసిన వారూ నష్టపోయే అవకాశం ఉందని, ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.


