హన్మకొండ: ఎల్నినో ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంది. దీంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ జిల్లాలో 45 శాతం లోటు వర్షపాతం ఉంది. ఎల్కతుర్తి, ఆత్మకూరు మండలాల్లో భారీ లోటు వర్షపాతం నెలకొంది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోయాయి. వర్షకాలం ప్రారంభమైనా ప్రతి నెల భూగర్భ జలాలు అడగంటుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో పాటు చెరువులు, కుంటల్లో నీరు లేక భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. దీనికి తోడు వర్షం ఆశతో వరి నారు పోసుకున్న రైతులు అందుబాటులో ఉన్న భూగర్భ జలాలతో పొలాలు దున్ని నాట్లు వేస్తున్నారు. వరి సాగుకు భూగర్భ జలాలు తోడుతుండడం కూడా భూగర్భ జలాలు పడిపోవడానికి ఒక కారణం. జిల్లాలో ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 410.2 మిల్లీమీటర్లు కాగా, 227.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. ఇంకా 45 శాతం లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
అంచనాలు తలకిందులు..
జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి ఈ వానా కాలంలో 2.38.830 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారులు అంచనా వేయగా.. 1,17,857 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పటి వరకు 49 శాతం పంటల సాగు జరిగింది. ప్రధాన పంటలైన వరి ఈ వానాకాలంలో 1,48,500 ఎకరాల్లో సాగవుతుందని అంచానా వేయగా.. ఇప్పటి వరకు 37,944 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి 84,400 ఎకరాలకుగాను 69,077 ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 5,000 ఎకరాల్లో సాగువుతుందని అంచనా వేయగా, 6,026 ఎకరాల్లో సాగైంది. నూనె గింజల పంటలు 120 ఎకరాలు, పప్పు దినుసులు 810 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, 760 ఎకరాల్లో సాగైంది. భూగర్భ జలాలు జిల్లాలో సగటున జూన్లో 7.25 మీటర్ల వద్ద ఉండగా జూలై మాసాంతానికి 7.71 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలో అత్యధికంగా పీచరలో 16.3 మీటర్ల లోతులో వంగరలో 13.58 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
జిల్లా సగటు భూగర్భ జలమట్టం 7.71 మీటర్లు
అత్యధికంగా వేలేరు మండలం
పీచరలో 16.3 మీటర్ల లోతున నీరు..
అత్యల్పంగా ధర్మసాగర్లో 2.8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు
45 శాతం లోటు వర్షపాతం


